చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని కీలక పాత్రను రామ్ చరణ్ తో చేయించబోతున్నట్లుగా చాలా నెలలుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కూడా ఈ చిత్రంలో చరణ్ నటించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. రాజమౌళి ఓకే చెప్తే ఆచార్య చిత్రంలో కొన్ని రోజుల పాటు చరణ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచి పోయాయి. ఆచార్య మరియు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓకే సారి డేట్లు కేటాయించడం కష్టం అవ్వడంతో చరణ్ ఆచార్య చిత్రం నుండి తప్పుకున్నాడనే టాక్ వినిపించింది. ఒక వైపు చరణ్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తుండగా మరో వైపు చరణ్ కు జోడీగా తమన్నా ఎంపిక అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే కొరటాల శివ ఈ చిత్రంకు గాను తమన్నాను సంప్రదించాడట. చిరంజీవికి జోడీగా కాజల్ నటించనుండగా చరణ్ కు జోడీగా తమన్నా నటించబోతుంది. సైరా చిత్రంలో చిరంజీవితో కలిసి నటించిన తమన్నా మరోసారి ఆయన సినిమాలో నటించబోతుంది. అయితే ఈసారి ఆచార్య చిత్రంలో చరణ్ కు జోడీగా నటించబోతుంది.